ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి.. హస్తినలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటూ జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం తరఫున కొన్ని విజ్ఞప్తులను ఆర్థిక మంత్రి ముందు ఉంచారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆర్థికశాఖ మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కూడా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

గత కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ప్రధానంగా అమరావతికి సంబంధించి రూ.15వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాష్ట్రానికి పలు నేషనల్ హైవేలు, స్టే హైవేలు, బైపాస్‌లు, ఫ్లై ఓవర్లను కూడా మంజూరు చేశారు. ఈసారి బడ్జెట్‌లో కూడా కేంద్రం తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చంద్రబాబు ఆర్థికశాఖ మంత్రిని కలిసి రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో మరి చూడాలి.

Related Videos