ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కిందట ఇదే రోజున అంటే 2019 మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తి అయ్యాయి. చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి చెత్త పాలనకు ఐదేళ్లు పూర్తయ్యాయని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో  విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత  నడిపిన పాలన వ్యవహారాలపై అధిక భాగం విమర్శల స్వరాలే వినిపిస్తున్నాయి.  ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన ప్రచారాన్ని నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన  ప్రజలు ఆ తర్వాత తాము ఎంత తప్పు చేశామోనంటూ పశ్చాత్తాప పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, ఎగ్జక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటుందని సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పటి వరకు అమరావతే రాజధానిగా ఉంటుందని భావించిన వారందరికీ షాక్ ఇచ్చారు.  దీనిపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగాయి. న్యాయస్థానాల్లో వాదనలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా దీన్ని ప్రధానంగా పార్టీలు ప్రచారం చేశాయి. గెలిచిన వెంటనే విశాఖ కేంద్రంగా తాను ప్రమాణం చేస్తానంటూ జగన్ ప్రకటిస్తే... అమరావతిలోనే ప్రమాణం చేస్తామంటూ టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే... జగన్ తన ఐదేళ్ల  పాలనలో విపరీత నిర్ణయాలు తీసుకుని ప్రజలపై రుద్దటంతో వారు అవస్థల పాలవుతున్నారు.  జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో జిల్లా వికేంద్రీకరణ ఒకటి. 13 జిల్లాలుగా ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా మార్చారు. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలను బేస్ చేసుకొని 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. మన్యం ప్రజల కోసం ప్రత్యేకంగా అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం అనే రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు.  అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థను నెలకొల్పడమే కాకుండా... వైద్య, విద్య వ్యవస్థను బాగు చేసేందుకు నాడు నేడు పేరుతో జగన్ సర్కారు ఓ విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టింది.  సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు బటన్‌ నొక్కడాన్ని కూడా ప్రాధాన్య అంశంగా తీసుకుంది జగన్ సర్కారు. ఇలాంటి నిర్ణయాల వల్ల మేలు ఎంత మేలు జరిగిందో ఏమో కానీ కానీ ... ప్రజలకు చెప్పుకోలేనంతగా కీడు జరగడంతో జగన్ పాలనపై వారు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ఈ ఐదేళ్లలో  విద్యుత్, బస్ చార్జీలు పెంపు, చెత్తపై వేసిన పన్ను, ప్రభుత్వ బిల్డింగ్‌లకు వైసీపీ రంగులు వేయడం, దిశ పేరుతో తీసుకొచ్చిన చట్టం అమలు కాకపోవడం, పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో, ఇలాంటి నిర్ణయాలు చేయడం వల్ల ప్రభుత్వం అభాసుపాలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Videos