జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి పాకిస్తాన్ సైన్యం జరిగిన విచక్షణారహిత షెల్లింగ్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలిపారు. మురళీ నాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుంట్లపల్లి పరిధిలోని కల్లి తండా. గురువారం రాత్రి నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్నప్పుడు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స అందించడానికి మురళీ నాయక్ను ఢిల్లీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం శనివారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.
మురళీ నాయక్ సోమందేపల్లిలో చదువుకున్నారు. దేశ రక్షణ కోసం ఓ మారుమూల గిరిజన తండా నుంచి భారత ఆర్మీలో చేరారు. ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ రైతు. వ్యవసాయం ఆధారిత కుటుంబం వారిది. మురళీ నాయక్ కన్నుమూసిన సమాచారం తెలిసిన వెంటనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబం విషాదంలో మునిగింది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దేశ రక్షణలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సీఎం, మాజీ సీఎం అన్నారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమంటూ... వీర జవాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుడు అంటూ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos