దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించి నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. తాజాగా ఇవాళ సోమవారం అతడికి జీవితఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది. 50,000 జరిమానా కూడా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
గత ఏడాది ఆగస్ట్9వ తేదీన కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జూనియర్ డాక్టర్పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్రాయ్. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో ఆగస్ట్ 10వ తేదీన పోలీసులు సంజయ్రాయ్ను అరెస్ట్ చేశారు. నవంబర్ 12న విచారణ ప్రారంభమైంది. పలుమార్లు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించడమే కాకుండా.. ఇవాళ నిందితునికి శిక్ష ఖరారు చేశారు. నేరం జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.
కోర్టులో వాదనల సందర్భంగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని CBI వాదించింది. భారత్ న్యాయ సంహిత సెక్షన్ 64, 66, 103(1) ప్రకారం దోషిగా తేలిన సంజయ్రాయ్కి ఉరే సరని సీబీఐ వాదించింది. మరోవైపు .. ఈ కేసులో తీర్పునకు ముందు సంజయ్రాయ్ తన వాదన చెప్పుకున్నాడు. విచారణ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు చెప్పాడు. ఎలాంటి కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని అన్నాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని చెప్పాడు.. తాను తప్పు చేసి ఉంటే, రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలని కానీ అలా జరగలేదని అన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రాయ్ బుకాయించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఎట్టకేలకు నిందితునికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos