Desk : జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం - కాంగ్రెస్ కూటమి నుంచి హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ పగ్గాలు చేపట్టనున్నారు. 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ ఇవాళ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు దక్కాయి. దీంతో, తిరిగి అధికారం దక్కించుకున్న సోరోన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసారు. భాగస్వామ్య పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.

తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను సోరెన్ ఆహ్వానించారు. జేఎంఎం శాసనసభా పక్ష సమావేశంలో సోరెన్ ను తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమి నుంచి సోరెన్ పార్టీ 34 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, ఆర్జేడీ 4 , సీపీఐ ఎంఎల్‌ రెండు స్థానాల్లో గెలిచాయి. ఎన్డీయే కూటమి 24 స్థానాలకు పరిమితం అయింది. దీంతో..కాంగ్రెస్‌ పార్టీ నాలుగు మంత్రి పదవులు కావాలని కోరుతోంది. ఆర్జేడీకి కేబినెట్ లో స్థానం దక్కనుంది. కాంగ్రెస్ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.

సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఇండియా కూటమి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకార వేడుకలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్‌ శరద్‌ వవార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పాల్గొంటారు. జార్ఖండ్‌లో వరుసగా రెండు సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కానీ 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలుకొట్టి హేమంత్‌ సోరెన్‌ వరుసగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు.

Related Videos