ఢిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలు గుప్పించాయి. నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారనే అంశం పైన స్పష్టత వస్తోంది. మహిళా ఓటింగ్ ఈ సారి కీలకంగా మారబోతోంది. ఇదే సమయంలో గెలుపు పైన కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి.
ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తల పడుతున్నాయి. ఈ మహా నగరం లోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,040 నామినేషన్లు దాఖలు కాగా, ఉప సంహరణల తరువాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి, 477 తిరస్కరించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులైన బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్కు చెందిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్తో తలబడుతున్నారు. ఈస్థానం నుంచి అత్యధికంగా 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు 23 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సగం ఓట్లు మహిళలవే కావటంతో ... అన్ని ప్రధాన పార్టీలు నగదు సాయం తో పాటుగా వారి కోసం కొత్త పథకాలను మేనిఫెస్టోల్లో చేర్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే, 38.51శాతం ఓట్లతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 4.26 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదు.
కానీ, కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 54.35 శాతం ఓటర్లు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కు 18.91 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ కు 24.17 శాతం మంది ఓటర్లు మద్దతు ఇచ్చారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు మాదిరిగానే బీజేపీ ఢిల్లీలోనూ తమదే విజయం అనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ - ఆప్ వేర్వేరుగా పోటీలో ఉండటం తో తమకు కలిసి వస్తుందని అంచనాతో ఉంది. కాంగ్రెస్ గ్యారంటీలనే నమ్ముకోగా.. ఆప్ ఈ సారి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో, ఓటర్ల తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos