ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెంది... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బయటికి వచ్చి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ చేరికల పర్వం ఇంతటితో ఆగేలా లేదు. ఇంకా పలువురు వైసీపీ నేతలు కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి నుంచి పలువురు వైసీపీ ముఖ్యులు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పైన జిల్లాలోని ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకోవద్దంటూ నేరుగా సీఎం చంద్రబాబుకే వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జగన్ వైసీపీ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఆళ్ల నాని ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనా... 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలిచారు. దీంతో నానికి జగన్ కేబినెట్ లో కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. కరోనా సమయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. అనంతరం జరిగిన 2024 ఎన్నికల్లో నాని ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసారు. ఏ పార్టీలోనూ చేరడం లేదని, రాజకీయాల్లోనూ ఉండటం లేదని చెప్పిన ఆళ్ళ నాని ... ఇప్పుడు యూటర్న్ తీసుకుని టీడీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆయన ఇప్పుడు టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉండగా... ఆ పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబును కలిసి తన అభిప్రాయం వెల్లడించారు. నానిని పార్టీలో చేర్చుకోవద్దని, ఈ విషయంపై మరోసారి ఆలోచన చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వ హయాంలో నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో టీడీపీ శ్రేణులను తీవ్రంగా వేధించారని, పలువురి పైన అక్రమ కేసులు పెట్టారని.. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను టీడీపీలోకి తీసుకొంటున్నారనే సమాచారం తెలిసి... పార్టీ కేడర్ తీవ్ర అసహనంగా, ఆగ్రహంగా ఉందని వివరించారు. పలువురి టీడీపీ నేతల, కార్యకర్తల ఇళ్లను కూల్చి వేయించి, ఆస్తులను ధ్వంసం చేయించిన నాని పార్టీలో చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
కాగా బడేటి రాధాకృష్ణ చెప్పిన అంశాలపైన యోచించిన చంద్రబాబు ఆళ్ల నాని ని పార్టీలో చేర్చుకునే విషయంపై పునరాలోచనలో పడినట్లు తెలిసింది. పార్టీ నేతల, బడేటి అభిప్రాయాలను పరిణయంలోకి తీసుకుంటామని, అన్ని అంశాలను పూర్తిగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిసింది. అయితే, పార్టీ బలోపేతం కోసం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా పార్టీ క్యాడర్ అంగీకరించి... సహక రించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవంగా ఆళ్ల నాని .. నిన్ననే టీడీపీలో చేరాల్సి ఉంది. ఆ మేరకు ఆయన అని ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పార్టీ నేతల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిన్న ఆళ్ల నాని నిర్ణయానికి టీడీపీ అధిష్టానం అడ్డు చెప్పింది. ఇప్పుడు విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఏలూరు టీడీపీలో ఆసక్తికరంగా మారుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos