ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. శుక్రవారం హస్తినకు వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా ఢిల్లీ పర్యటనకు వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చంద్రబాబు శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.

శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు.. అక్కడ మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు వేట నిషేధం అమల్లో ఉంది.. ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇవ్వగా.. శనివారం ఈ పథకం ప్రారంభం కానుంది. చంద్రబాబు ఇవాళ కూడా బిజీగా గడిపారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో అధికారులతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది.

Related Videos