కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అగ్రనాయకత్వం హైదరాబాద్ తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా ముహూర్తం ఎంపిక చేసింది.
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ - సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ చేసిన అభ్యర్థనను అంగీకరించినందుకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి తెలంగాణ పీసీసీ ధన్యవాదాలు తెలిపింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ఐదు హామీలను ఇక్కడే ప్రకటించాలని సోనియా గాంధీని అభ్యర్థించామని చెప్పారు. సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు.
తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ వేదికగా విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సారి అదే రోజున కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ఎన్నికల సమర శంఖం పూరించనుంది. సెప్టెంబర్ 16 న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. మరుసటి రోజున సెప్టెంబరు 17న సీడ్బ్ల్యూసీ సభ్యులతో పాటు , కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీ స్కీంలను సోనియా... ఈ సభలో ప్రకటించనున్నారు. సెప్టెంబరు 17న నగరంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్తో బీజేపీ నాయకత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. తొలుత వరంగల్లో సభ పెడతామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తామని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ సభకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 2న రక్షణ శాఖకు లేఖ రాశామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభను వాయిదా వేయబోమని ... 10 లక్షల మందితో సభను నిర్వహిస్తామని రేవంత్ తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 17న నిర్వహించే సభ వేదికగానే సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతల ద్వారా సోనియా గాంధీ ప్రకటించిన ఐదు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఈ సెప్టెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించి మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించాలన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తామని, వారు భారత్ జోడో యాత్ర విశిష్టతను ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos