కేంద్రప్రభుత్వం సామాన్యుడికి శుభవార్త చెప్పింది. ఆకాశాన్ని తాకిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అతి త్వరలోనే కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6,100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ అతి త్వరలోనే ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి లోపల ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు అదనంగా రూ.200 వరకు తగ్గించనుంది. దీంతో పీఎంయూవై లబ్ధిదారులు ఒక్కో సిలిండర్పై రూ.400 వరకు ఆదా చేసుకోవచ్చు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాది పాటు రూ.200 వరకు సబ్సిడీ పొడిగిస్తూ 2023 మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రజలు, పేదలకు ఎల్పీజీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ఆరంభించింది. ఎలాంటి డిపాజిట్లు లేకుండా వీరికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్పై సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తోంది. ఆగస్టు నెలారంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.99.75 తగ్గించింది. దాంతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1680 కి చేరుకుంది. అయితే 14.2 కిలోల గృహ అవసరాల సిలిండర్ ధరను మార్చి ఒకటి నుంచి తగ్గించలేదు. ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్ రూ.1100 నుంచి రూ.1120 వరకు ఉంటోంది. బహుశా సెప్టెంబర్ ఒకటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ల ధరలు తగ్గుతాయని అంచనా.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos