తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. తెలంగాణ ఓటర్లకు చేరువవ్వడమే లక్ష్యంగా రెండు కీలక ప్రకటనలు కూడా చేశారు. ఒకటి ములుగులో రూ.900 కోట్లతో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు కాగా... రెండోది తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు మంజూరు. గిరిజన వర్సిటీ మాటెలా ఉన్నా.. జాతీయ పసుపు బోర్డ్ ప్రకటన వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా. . అసలు కారణాలు వేరే ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కల్వకుంట్ల కవిత పలుమార్లు పసుపు బోర్డ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినా అవన్నీ వృథాగానే మిగిలిపోయాయి.
ఆ తరువాత... 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ ... తనను గెలిపిస్తే... జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హామీ నెరవేర్చి తీరుతానని విస్తృత ప్రచారం చేశారు. బాండ్ పేపర్పై ఓటర్లకు ఈ మేరకు రాసిచ్చారు కూడా. కేంద్రంతో పసుపు బోర్డ్ ప్రకటన చేయించలేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అంతకుముందు 2014 – 19 మధ్య కాలంలో ఎంపీగా ఉన్న కవిత... ఈ హామీ నెరవేర్చడంలో విఫలం కావడంతో... అర్వింద్ ఇచ్చిన హామీ, ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. దీంతో 2019లో ఓటర్లు కవితను ఓడించి అర్వింద్ ను గెలిపించారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పసుపు బోర్డ్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో పరిస్థితులు ఎంపీ అర్వింద్కు ప్రతికూలంగా మారుతున్నాయని బీజేపీ వర్గాలు ఆందోళన చెందాయి.
అందుకే అర్వింద్ అలర్ట్ అయ్యారని... దాని పర్యవసానంగానే ప్రధాని నోట ఈ ప్రకటన వెలువడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 9 ఏళ్ల నుంచి పసుపు బోర్డ్ ఏర్పాటు డిమాండ్ ఉన్నప్పటికీ ఎన్నికల సమీపిస్తున్న సమయంలోనే ప్రకటన చేయడం చూస్తుంటే ఇదే వాస్తవం కావచ్చనే విషయం క్లియర్ గా అర్థమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయకపోతే బీజేపీకి, ఎంపీ అర్వింద్కు ఇబ్బందులు తప్పవని పసిగట్టారని బీఆర్ఎస్ శ్రేణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తేలాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos