ఏపీ ప్రభుత్వంతో జేఏసీ నేతలు నామమాత్రంగా చర్చలు జరిపి ... మొక్కుబడిగా సంతకాలు పెట్టి రావడంపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ చిరకాల డిమాండ్ల పరిష్కారం కోసం ... ప్రభుత్వంతో సీరియస్ గా చర్చలు జరపకుండా ... ఏ అధికారి లేదా ఏ రాజకీయ నేత మెప్పు కోసమో... చర్చల్లో ఉబుసుపోని కబుర్లు చెప్పి... మమ అనిపించేలా వాటిని ముగించడమేమిటని వారు భగ్గుమంటున్నారు. ఆ శాఖలోని అంతర్గత వాట్సాప్ గ్రూపులలో జేఏసీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. జేఏసీ నేతల ఫొటోలు పెట్టి మరీ దూషిస్తూ ఉద్యోగులు పోస్ట్ చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో చర్చించకుండా సంతకాలు ఎలా పెడతారంటూ జేఏసీ నేతలను ఉద్యోగ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి ... రాష్ట్ర జేఏసీ వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ రాజీనామా చేశారు. ఇంజనీర్లు భారీగా నష్టపోతారని ... కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కి .... ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ... ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూడా తెలిపిందంటూ... ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈ విషయం గురించి జేఏసీ నేతలు మాట్లాడుతూ... విద్యుత్ శాఖలోని 26 సంఘాల వారు... ప్రభుత్వ పెద్దలతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. కాగా... సమ్మెకు వెళ్లడం ఖాయమన్న కారణంగా విద్యుత్ ఉద్యోగులు సంస్థ ఇచ్చిన సీయూజీ సిమ్లను అధికారులకు అప్పగించేశారు. చర్చలు సఫలమైన సమాచారం రావడంతో వాటిని తీసుకోవడానికి రాత్రికి రాత్రే వారు కార్యాలయాలకు వెళ్లారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో క్షేత్రస్థాయి సిబ్బంది 1500 మంది వరకు ఉంటారు. వారంతా షిఫ్ట్ల వారీగా విధులను నిర్వర్తిస్తారు. రాత్రిపూట షిఫ్ట్ల్లో ఉండాల్సిన ఉద్యోగులు వర్క్ టు రూల్ కారణంగా సాయంత్రం ఐదు గంటలకే విధులు ముగించేసుకున్నారు. సమ్మె ఆగిపోవడంతో ఇంటి వద్దే ఉన్న ఉద్యోగులు రాత్రిపూట విధులకు పయనమయ్యారు. కాగా... విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట విద్యుత్ కోతలు తీవ్రంగా ఉంటున్నాయి. సిబ్బంది సమ్మెలోకి వెళ్తే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని ప్రజలు ఆందోళన చెందారు. కానీ వారు సమ్మెకు వెళ్లడం లేదని తెలియడంతో ఆనందం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos