వివాదాలకు కేరాఫ్ గా ఉన్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ వలకు చిక్కారు. హైదరాబాద్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆయన... ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ... ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్లోని వీసీ నివాసానికి వెళ్లి బాధితుడు రూ. 50 వేల లంచం ఇవ్వబోగా... వీసీ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వాస్తవంగా తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి గత కొద్దిరోజులుగా తెలంగాణ వర్శిటీ వ్యవహారంపై గట్టిగా చర్చ నడుస్తోంది. వీసీ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. నియామకాల్లో అక్రమాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. రిజిస్ట్రార్ నియామకం విషయంలోనూ వీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు.
తాజాగా … ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గతంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలక మండలితో వీసీ తీవ్రంగా తలపడ్డారు. పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో చివరకు యాదగిరికి రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. ఆర్డర్ కాపీ తీసుకున్న యాదగిరి టీయూ పాలకమండలి సభ్యులకు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్కు సమాచారమిచ్చారు. ఈసీ సూచన మేరకు ఆయన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలాఉండగానే…. వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కటం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు లంచం తీసుకుంటున్న ఈ ఘటనలో ఆయన రెడ్ హ్యాండెండ్ గా ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala