కాదేదీ కవితకనర్హం అనేది పాతమాట.. కానీ కాదేదీ చోరీకనర్హం అనేది ఇప్పటిమాట. ఒకప్పుడు దొంగలు బంగారం, వెండితో తయారుచేసిన విలువైన నగలు, ఆభరణాలు, డబ్బు వంటి వాటిని చోరీ చేసేవారు. కానీ ఇప్పుడు వారు పంథా మార్చుకున్నారు. ఎందుకోమరి ... ఈ స్టోరీ కాస్త విందాం. నిన్నమొన్నటివరకు టమోటా ధరలు ఎంత తక్కువగా ఉన్నాయో మనందరికీ తెలుసు. 8 కిలోల టమోటా ధర కేవలం వందరూపాయలే పలికింది. అంటే కిలోధర 15 రూపాయలు కూడా లేదన్నమాట. వాటిధర ఒక్కసారిగా పెరిగి ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ... ఇప్పుడు కిలో టమాట ధర 160 రూపాయల పైమాటే.
ఊహకు అందని విధంగా టమాటాల ధరలు ఒక్క నెలరోజుల్లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు టమాటాలతో పాటు ... మేమూ ఉన్నామంటూ... పచ్చిమిర్చి ధరల మంట కూడా సామాన్యుల నషాళానికి తాకుతుంది. వంట గదిలో నిత్యం అవసరమయ్యే టమాటాలు, పచ్చిమిరపకాయలు విపరీతంగా ధరలు పెరిగిన వేళ విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగలు పంట పొలాల్లో టమాటాలను చోరీ చేయడం మాత్రమే కాకుండా, ఆఖరుకు కూరగాయల మార్కెట్ లోనూ భారీగా కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే తెలంగాణలో డోర్నకల్ మండలంలోని కూరగాయల మార్కెట్ లో చోటు చేసుకుంది. మార్కెట్ లోని పలు దుకాణాల్లో ముఖ్యంగా టమాటాలు, పచ్చిమిర్చి చోరీ చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో కూరగాయల వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
రాత్రి వేళ వారు టమాటాలు, పచ్చి మిరపకాయలకు కాపలా ఉండాల్సిన పరిస్థితి కూరగాయల వ్యాపారులకు వచ్చింది. ఇదిలావుండగా... గత ఏడాది ఉల్లిపాయల ధరలు ఆకాశానికి చేరిన నేపథ్యంలో మహారాష్ట్ర లోని నాగపూర్ లో ఏకంగా.. ఓ ఉల్లిపాయల లోడునే దొంగలు దోచుకుపోయారు. ఇప్పుడేమో దొంగల చూపంతా టమోటా, పచ్చిమిర్చి మీదే ఉండటంతో... టమోటా దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. విజయవాడ గుంటూరు.. సహా హైదరాబాద్ లోని మోండా మార్కెట్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను 24 గంటల్లో ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించారు.
ఇదిలావుంటే.. కర్ణాటక హనగల్ తాలుకా అక్కియాలుర్ గ్రామానికి చెందిన కృష్ణప్ప అనే కూరగాయల వ్యాపారి... తాను విక్రయించే స్థలంలో కెమెరాలు బిగించేందుకు అనువైన సౌకర్యం లేకపోవడంతో ... ఏకంగా కూరగాయల పెట్టెలోనే కెమెరా ఉంచి టమాటాలు విక్రయిస్తున్నాడు. టమాటాల ను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నట్లు కృష్ణప్ప చెబుతున్నాడు. చూశారామరి... ఒకప్పుడు మార్కెట్ లేక రోడ్లపై పారేసిన టమోటాలను, పచ్చిమిర్చిని ఇప్పుడు బంగారం, వెండిలాగా భద్రంగా కాపాడుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇదండీ టమోటా రైతన్నల దీనగాథ. అందుకే ... ధరలు పెరిగినా... అవి దారుణంగా పడిపోయినా బాధపడాల్సింది మేమేకదా అని వారు వాపోతున్నారు. పాపం టమోటా రైతన్నది ఎంత దీనగాథో కదా.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos