తెలుగు రాష్ట్రాలపై రెమాల్ తుఫాన్ ప్రభావం కారణంగా విచిత్ర వాతావరణం నెలకొంది. తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతుండగా... ఏపీలో మాత్రం ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి . ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ హెచ్చరించారు. తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం రెండవ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు నుంచి కాకినాడ వెళ్లే వివిధ వాహనాల రాకపోకలను కొత్తపల్లి మండల పోలీసులు ఆపేశారు. గోర్స, పండూరు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకోవాలని సూచించారు.
మరోవైపు రెమాల్ తుఫాను ప్రభావం వల్ల తెలంగాణలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 15 మంది వరకు చనిపోయారు. భారీగా భారీ ఆస్తి నష్టం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన 38 ఏళ్ళ తండ్రి, 11 ఏళ్ల ఆయన కుమార్తె ... అదేవిధంగా పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా తిమ్మాయిపల్లిలో చెట్టుకొమ్మలు విరిగిపడి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. అదేవిధంగా ములుగు మండలం క్షీరాసాగర్లో గోడ కూలి ఇద్దరు, ఈదురుగాలుల ధాటికి కోళ్లఫారం గోడ కూలడంతో గణపురం గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందారు. గాలుల బీభత్సం కారణంగా చంద్రాయణగుట్టలో మరో మహిళ మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర షెడ్డుపై నుంచి సిమెంటు ఇటుకలు పడి వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. బిజినేపల్లి మండలం నంది ఒడ్డెమాన్లో ఒక రైతు, తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో మరో రైతు పొలాల్లో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. అదేవిధంగా తెలకపల్లికి చెందిన 12 బాలుడు పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు హైదరాబాద్ శివారు హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వనస్థలిపురం గణేష్ ఆలయం రోడ్డులో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. పలు కార్లు దెబ్బతిన్నాయి. హయత్నగర్-1 డిపోలో చెట్టు విరిగి పడడంతో బస్సు ధ్వంసమైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్జీవో కాలనీ, గౌరవెలి ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షం ధాటికి ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ సర్కిల్, గచ్చిబౌలి ఔటర్ సర్కిల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos