ఏపీలో నిన్న ఆకస్మకంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న అంటే గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ... రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్తో చర్చించినట్లుగా తెలుస్తోంది. క్యాంప్ కార్యాలయంలో రాత్రి విందు తర్వాత అదానీ తిరుగుపయనం అయ్యారు. గౌతమ్ అదానీ, సీఎం జగన్ భేటీ గురించి ముందస్తుగా ఎలాంటి అధికారిక సమాచారం కానీ, భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన కానీ రాలేదని సర్వత్రా అనుకుంటున్న వేళ... తమ భేటీ గురించి అదానీ నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ట్వీట్ చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎప్పట్లాగే సానుకూల సమావేశం జరిగిందని... ఏపీలో అదానీ సంస్థల కీలక పెట్టుబడులు, ముఖ్యంగా గంగవరం పోర్ట్, వైజాగ్ డేటా సెంటర్పై చర్చించామని... ఈ ప్రాజెక్టులు ... అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్కు కీలకమని మేం ఇరువురం భావిస్తున్నామని’ ఆయన పేర్కొన్నారు. కాగా వీరిద్దరి భేటీపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలోనూ పలుమార్లు గౌతం అదానీ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. అయితే ఎప్పుడూ అధికారికంగా భేటీల గురించి సీఎంవో కానీ.. సీఎం క్యాంప్ ఆఫీసు వర్గాలు కానీ ప్రకటన చేయలేదు. ఓసారి తన కుటుంబంలో శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చారని అనధికారికంగా చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి ఆహ్వానం కోసం వచ్చి ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా అయితే దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎవరైనా సీఎం జగన్ ను కలిసేందుకు వస్తే ప్రత్యేకంగా మీడియాకు తెలియచేస్తారు. ఏ పని మీద వచ్చారో చెబుతారు... పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు ఉంటే వాటి గురించి కూడా వివరిస్తారు. తర్వాత ఫొటోలు, వీడియోలు పీఆర్వోల ద్వారా మీడియాకు సమాచారం ఇస్తారు. కానీ గౌతం అదానీ భేటీల విషయంలో ఎప్పుడూ సమాచారం ఇవ్వలేదు. అందుకే వ్యక్తిగత పర్యటనగా భావిస్తున్నారు. మరోవైపు ఏపీలో అదానీ గ్రూపు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టులను కొనుగోలు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూపునకు ప్రభుత్వం అమ్మేసింది. అలాగే సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో గౌతం అదానీ కుమారుడు పాల్గొని భారీ పెట్టుబడులను ప్రకటించారు. ఏడాదికి 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప, నడికుడిలో రెండు సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో 400 మెగావాట్ల డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. ఇలా ఏపీలో పలు ప్రాజెక్టులతో అదానీ సంస్థ కీలకంగా ఉంది. ఇలాంటి సమయంలో అదాని... అకస్మాత్తుగా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos