నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 చిత్రానికి విడుదల ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 'అఖండ 2' సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలు కల్పించడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వ జీవోను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హోంశాఖ, చిత్ర నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ యాక్షన్ చిత్రం రేపు డిసెంబర్ 12న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రాత్రికి ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు.

'అఖండ 2' సినిమాకు డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు.  అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఇవాళ రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలపై గందరగోళం నెలకొంది. టికెట్ ధరల విషయంలోనూ సందిగ్ధత ఏర్పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos