ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు ఊరట దక్కింది. నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఆదేశించింది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైెఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా నంద్యాలలోకి ఆయన్ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేవు. అయినా సరే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్పై శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలపై అప్పట్లో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును క్వాష్ చేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ గత నెల 25న విచరణ జరిగింది.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై బుధవారం అంటే ఇవాళ తుది తీర్పు ఇస్తామని ప్రకటించి... ఈ మేరకు అల్లు అర్జున్పై కేసును క్వాష్ చేస్తూ తీర్పును వెల్లడించింది.
మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పురోహితులు వేదాశీర్వచనం అందించారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే తిరుమలకు రాలేదు.. స్నేహారెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2 ది రూల్’లో రష్మిక హీరోయిన్. ఈ మూవీ డిసెంబరు 5న పాన్ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ నంద్యాల కేసు నుంచి బయటపడటంతో ఆయన అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos