అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వివాదాస్పదం అయ్యాయి. ఒక సినిమా వేడుక‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వార‌స‌త్వంపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం నెట్టింట ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదం అయ్యాయి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ సినిమాకు ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించగా.. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వహించారు. ఈ వేడుక‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర‌బృందానికి సినిమా విజ‌యవంతం అవ్వాల‌ని ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అయితే ఈ వేడుక‌లో చిరు మాట్లాడుతూ… తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు, నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది. చ‌ర‌ణ్ ఇప్ప‌టికైనా ఒక అబ్బాయిని క‌ను.. నా వారసత్వం కొనసాగాలంటే మ‌నువ‌డు కావాలి. కానీ చ‌ర‌ణ్‌కి మ‌ళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరు చేసిన లింగ సంబంధ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 2025లో కూడా వారసుడు కావాల‌ని కోరుకుంటున్నారని,ఇలాంటి మ‌నుషులు ఉన్న స‌మాజంలో మ‌నం బ్ర‌తుకుతున్నామంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా చిరంజీవి మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్‌కి కూడా అదే కోరిక ఉంది. స్టార్‌ హీరోల్లో దాదాపు అందరికీ వారసులు ఉన్నారు. రామ్‌ చరణ్‌కి మాత్రమే వారసుడు లేకపోవడంతో ఆయన వారసుడు ఎప్పుడు వస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్లింకార చిన్న పాపే కనుక చరణ్‌, ఉపాసన దంపతులు తదుపరి సంతానానికి కాస్త గ్యాప్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ ఎంత తీసుకున్నా చరణ్ తదుపరి మెగా కాంపౌండ్ లెగస్సీని కంటిన్యూ చేసే వారసుడిని తీసుకు రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. చిరంజీవికి సైతం మనవడు కావాలని కోరిక బలంగా ఉంది కనుక ఫ్యాన్స్ సైతం అదే కోరికను వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ వ్యాఖ్యలు ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారాయి.

Related Videos