ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భారీ మోసానికి గురయ్యారు. అధిక లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడి పెట్టిన ఆయన ఏకంగా రూ. 63 లక్షలు కోల్పోయారు. హైదరాబాద్లోని మోతీనగర్కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ అనే దంపతులతో అమితవ్ తేజకు 2025 ఏప్రిల్లో పరిచయం ఏర్పడింది. స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయని ఆ దంపతులు అమితవ్ను నమ్మించారు. ఒకవేళ నష్టం వస్తే తాము ఉంటున్న ఫ్లాట్ను ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మిన అమితవ్ పలు విడతలుగా పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేశారు. వారం రోజుల తర్వాత రూ. 9 లక్షల లాభం వచ్చిందంటూ నిందితులు నకిలీ పత్రాలను చూపించడంతో ఆయన మరిన్ని పెట్టుబడులు పెట్టారు. రోజులు గడిచినా లాభాలు రాకపోగా, అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా నిందితులు కాలయాపన చేశారు. చివరకు వారు ఫోన్ నంబర్లు మార్చి పరారవ్వడంతో తాను మోసపోయానని అమితవ్ గ్రహించారు. తమను మోసం చేసిన దంపతులపై అమితవ్ తేజ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్ మరియు చీటింగ్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అమితవ్ తేజ వ్యాపారవేత్తగా కొనసాగుతూనే, త్వరలోనే తన తండ్రి దర్శకత్వంలో హీరోగా వెండితెరపైకి అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos