బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతుండటంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ జిల్లాలోని పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతోపాటు పలు లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు కింగ్ నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు.
ఈ రోజు నాగార్జున ఓ జ్యూయలరీ షాపు ప్రారంభానికి అనంతపురం వచ్చారు. అయితే మార్గమధ్యంలోనే ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి విమానంలో వచ్చిన నాగార్జున అనంతపురం వస్తుండగా వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన జ్యూయలరీ షాపు యాజమాన్యంతోపాటు ఆయన అనుచరులు అక్కడి నుంచి మరో మార్గంలో అనంతపురానికి జాగ్రత్తగా తీసుకువచ్చారు. దీంతో నాగార్జునకు పెను ప్రమాదం తప్పినట్లైందని ఆయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పండమేరు వాగు పొంగి ప్రవహించడంతో.. అనంతపురం నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీతో పాటుగా.. వాగుకు పక్కనే ఉన్న కాలనీలు నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. అలాగే పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్- బెంగళూరు నేషనల్ హైవే మీద వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos