బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులకు నటి హేమ షాక్ ఇచ్చారు. బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉన్న హేమ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 86 మందికి విచారణకు రావాలని నోటీసులు పంపించిన పోలీసులు ... నటి హేమతో పాటు 8 మందికి విచారణకు రావాలని ఇదివరకే నోటీసులు పంపారు. ఈ క్రమంలో నటి హేమ సోమవారం బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాకుండా పోలీసులకు ఒక లేఖ రాశారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని చెప్పిన నటి హేమ ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావటానికి సమయం కావాలన్నారు. ఈ లేఖను బెంగళూరు సిసిబి పోలీసులకు పంపించారు. దీంతో హేమకు మరోమారు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీ అయ్యారు. హేమ విచారణకు హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న పోలీసులు ఆమెకు మళ్లీ మరొక తేదీని కేటాయిస్తూ నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ తాను అసలు పాల్గొనలేదని ఒక వీడియో రిలీజ్ చేసి మరీ బుకాయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పేందుకు చికెన్ బిర్యాని ఎలా తయారు చేయాలో ఒక వీడియోని చేసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక నటి హేమ జనాలను తప్పుదారి పట్టించే క్రమంలో వీడియోలు చేస్తోందని బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారని పోలీసులు ధృవీకరించారు. అంతేకాదు బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందికి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసేందుకు రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ పరీక్షలలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నేడు ఎనిమిది మందిని విచారించనున్న క్రమంలో హేమ తాను రాలేనని లేఖ రాయగా ... మరి మిగతావారు అయినా హాజరయ్యారా అనేది తెలియాల్సి ఉంది. విచారణకు హాజరుకాని వారి విషయంలో బెంగళూరు సిసిబి పోలీసులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos