గత కొంతకాలంగా సినిమా పరిశ్రమకు అతిపెద్ద సవాలుగా మారిన పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి అరెస్టుతో సినీ పరిశ్రమ ఊపిరిపీల్చుకోగా.. సామాన్యులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అతడు ఎంచుకున్న మార్గం తప్పుకావొచ్చు కానీ.. చేసింది మాత్రం కరెక్టే అని అంటున్నారు. సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని.. ఫ్యామిలీతో థియేటర్కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇటువంటి సమయంలో ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికీ న్యాయమైనదే అని అతనికి మద్దతు పలుకుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఐబొమ్మ రవి అరెస్ట్పై కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సీపీ సజ్జనార్ సినిమా పరిశ్రమ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడంపై తీన్మార్ మల్లన్న తీవ్రంగా మండిపడ్డారు. ఐ బొమ్మ రవి దమ్మున్నోడు.. అందుకే అతనికి ప్రజల మద్దతు ఉంది. వంద రూపాయల టికెట్ను వేలల్లో అమ్ముకునే సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా.. సజ్జనార్ను చూస్తే జాలేస్తుంది. నిన్ను చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావట్లేదు పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని సినిమా డైలాగ్లు కొట్టడం మానుకోవాలి. ఐబొమ్మ రవి గురించి అతడి భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసుల ఆల్సేషన్ కుక్కలు కూడా ఐబొమ్మ రవిని పట్టుకునేవి కావు. సజ్జనార్ ఇకైనైనా రియాల్టీకి రా.. నువ్వు చేసేవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లే. వరంగల్లో చేసింది కూడా అదే కదా. నీకు దమ్ముంటే సైబర్ క్రైంలను ఆపు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ మోసాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. దమ్ముంటే వాటిని ఆపి చూపండి' అంటూ సజ్జనార్కు మల్లన్న సవాల్ విసిరారు.
గతంలో సీవీ ఆనంద్ సైతం ఐబొమ్మ లాంటి మోసాలు ఆగవని.. అవి కొత్త కొత్త మార్గాల్లో జరుగుతూనే ఉంటాయని చెప్పిన విషయాన్ని మల్లన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఛాలెంజ్లు చేయడం మానేసి.. సైబర్ మోసాలను అడ్డుకునే పనుల్ని చేయాలని మల్లన్న సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. మల్లన్న వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మల్లన్న వ్యాఖ్యలు పోలీసు శాఖను అగౌరవపర్చే విధంగా ఉన్నాయని.. గతంలో సజ్జనార్ నిర్వహించిన ఎన్కౌంటర్ల వంటి కీలక ఆపరేషన్లను విస్మరించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos