ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కొనసాగుతున్న క్రమంలో... మరోవైపు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. భార్య భూమా మౌనిక రెడ్డి, కుమార్తె దేవసేనతో కలిసి సుదీర్ఘ విరామం తరువాత మంచు మనోజ్ ... ఆళ్లగడ్డకు వచ్చి ఆయన అత్తగారు అయిన మాజీ మంత్రి భూమా శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆమె సమాధికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ పై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో ఈరోజు ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని ప్రఖ్యాత అహోబిళం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. దిగువ అహోబిళంలో లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో వారి వెంట భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉండగా... మంచు మనోజ్- మౌనిక రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ జనసేన పార్టీలో చేరుతారని, వచ్చే ఎన్నికల్లో మనోజ్ లేదా మౌనిక రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రచారం నంద్యాల జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఆళ్లగడ్డకు వచ్చిన మంచు మనోజ్ ఈ విషయాన్ని తోసిపుచ్చట్లేదు. అలాగనీ దాన్ని బలపరచనూ లేదు. జనసేనలో చేరికపై ఇప్పట్లో ఏ విషయాన్ని చెప్పలేనని అన్నారు.
జనసేనతో భూమా కుటుంబానికి సత్సంబంధాలు ఈనాటివి కావు. వారి మధ్య సంబంధాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. 2009 నాటి ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అప్పట్లో పవన్ కల్యాణ్ సైతం ఆమె కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు కోసం జనసేన నాయకులు సైతం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె రోడ్ షోలను విజయవంతం చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ జనసేన వైపే అడుగులు వేయవచ్చనేది వాస్తవ రూపం దాల్చవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos