టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్లోని లండన్లో అడుగుపెట్టారు. యూకే పార్లమెంట్లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఆయన అరుదైన సత్కారం అందుకోనున్నారు. లండన్లోని హీత్రో విమానాశ్రయంలో చిరంజీవి నేడు ల్యాండ్ కాగా... ఆయనకు యూకేలోని తెలుగు రాష్ట్రాల అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. చిరంజీవికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ అందించనుంది. కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని మెగాస్టార్కు ఇవ్వనుంది. ఈ సందర్భంగా హౌస్ సభ్యులు ఆయనను సత్కరించనున్నారు. మార్చి 19న అంటే రేపు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసమే లండన్కు వెళ్లారు చిరంజీవి.
దీంతో లండన్లోని విమానాశ్రయంలో చిరంజీవికి ఆయన అభిమానులు స్వాగతం పలికారు. యూకే మెగా అభిమానుల నుంచి వెల్కమ్ అన్నయ్యా అంటూ బ్యానర్లు పట్టుకొని మరీ స్వాగతం చెప్పారు. విమానాశ్రయానికి వచ్చిన అభిమానులతో చిరంజీవి ఆప్యాయంగా మాట్లాడారు. నవ్వుతూ పలుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను అందుకున్నారు. డ్యాన్స్కు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా గత ఏడాదే సొంతం చేసుకున్నారు. గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. ఇప్పుడు యూకే పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కించుకుంటున్నారు చిరంజీవి. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన మెగాస్టార్.. చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి, సేవకు అవార్డులు దక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితోనూ ఓ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ చేయనున్నారు చిరంజీవి. జూన్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos