తెలుగు గడ్డపై పుట్టి, దక్షిణ భారత చిత్రసీమలో తన నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి శారద అరుదైన గౌరవం అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన జీవితకాల సేవలకుగాను కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన 'జేసీ డేనియల్ అవార్డు-2024'కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజి చెరియన్ నిన్న శుక్రవారం తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రముఖ గీత రచయిత, 2017 జేసీ డేనియల్ అవార్డు గ్రహీత శ్రీకుమరన్ తంబి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ... ఈ పురస్కారానికి శారదను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ కమిటీలో నటి ఊర్వశి, సినీ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ కన్వీనర్‌గా వ్యవహరించారు.  శారద అసాధారణ ప్రతిభ కలిగిన నటి అని, తన నటనతో మలయాళ చిత్రసీమకు రెండు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందించారని జ్యూరీ కొనియాడింది. 1960ల నుంచి రెండు దశాబ్దాల పాటు మలయాళీ మహిళల జీవితాలను తెరపై ఆవిష్కరించి, ఆ పాత్రలకు జీవం పోశారని ప్రశంసించింది. ఆనాటి మహిళల బాధ, సహనం, భావోద్వేగాలను తన అద్భుతమైన నటనతో కళ్ళకు కట్టారని జ్యూరీ అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో 1945 జూన్ 25న వెంకటేశ్వరరావు, సత్యవాణి దేవి దంపతులకు శారద జన్మించారు. ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. తెలుగులో 'ఇద్దరు మిత్రులు' చిత్రంతో నటిగా అడుగుపెట్టి, తన పేరును శారదగా మార్చుకున్నారు. 1965లో 'ఇణప్రావుకళ్' చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించారు. 'తులాభారం' (1968), అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన 'స్వయంవరం' (1972) చిత్రాలకుగాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్రం 'నిమజ్జనం' (1977)తో మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా నిలిచి చరిత్ర సృష్టించారు.

"మురప్పెన్ను', 'త్రివేణి', 'మూలధనం', 'ఇరుట్టింతె ఆత్మావు', 'ఎలిప్పతాయం', 'ఒరు మిన్నామినుంగింటె నురుంగువెట్టం', 'రాప్పకల్' వంటి ఎన్నో మరపురాని చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 125కు పైగా మలయాళ చిత్రాలలో నటించి, అక్కడి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ఇలాంటి గొప్ప నటికి రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం అందించడం సముచితమని జ్యూరీ పేర్కొంది. అప్పట్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా శారద మూడుసార్లు ఊర్వశి అవార్డు అందుకోవడంతో అమె పేరుకు ముందు ఊర్వశి స్థిరపడిపోయింది. అప్పటి నుంచి ఆమెను 'ఊర్వశి' శారద అని పేర్కొంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos