బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత స్టార్ షట్లర్, మాజీ ఛాంపియన్ పీవీ సింధు దుమ్మురేపుతోంది. గత కొన్ని నెలలుగా ఫామ్లేమితో ఇబ్బంది పడిన సింధు.. ప్రతిష్టాత్మక టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-19, 21-15 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా షట్లర్ వాంగ్ జి యిపై విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు వరుస గేమ్లను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో వాంగ్పై తన ముఖా ముఖి రికార్డ్ను 3-2తో మెరుగుపరుచుకుంది. తొలి గేమ్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా.. సింధు తన అనుభవంతో గేమ్ పాయింట్ సాధించింది. ఇవాళ శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమయ్యే క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ పుత్రి కుసుమవర్ధనితో సింధు తలపడనుంది. 38వ ర్యాంకర్ అయిన పుత్రి కుసమవర్దనితో 12వ ర్యాంకర్ పీవీ సింధు ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గెలిచింది. గత ఏడాది జరిగిన ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో సింధు 21-15, 21-17 తేడాతో పుత్రి కుసుమ వర్ధానిపై విజయం సాధించింది. ఈ రికార్డ్ ప్రకారం సింధు సునాయసంగా సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సింధుకు మెరుగైన రికార్డ్ ఉంది. 2019లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. 2017, 2018 టోర్నీలో రజత పతకాలు అందుకుంది. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించింది. ఈ సారి తిరిగి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos