దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారట్లేదు. మరింత ముదిరాయి. దీనిపై ఆయన క్షమాపణలు సైతం చెప్పారు. అయినా కూడా అవి రేపిన ప్రకంపనలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని.. ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివాజీ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై అసహనాన్ని వ్యక్తం చేశారు. "హీరోయిన్లు చీరల్లో చాలా అందంగా, నిండుగా కనిపిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు శరీరం ప్రదర్శించేలా, సామాన్లు కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అటువంటి వస్త్రధారణ అస్సలు బాలేదు" అని వ్యాఖ్యానించారు. దీనిపై చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు మనోజ్.. వంటి సెలెబ్రిటీలు స్పందించారు. నిప్పులు చెరిగారు. తోటి నటుడు చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ మనోజ్ పేర్కొన్నాడు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది తెలంగాణ మహిళా కమిషన్. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు అవ్వాలని ఆదేశించింది. మహిళలను కించపరచాలనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. దీన్ని సుమోటోగా స్వీకరించామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1995 సెక్షన్ 16 (1) (బీ) కింద విచారణకు ఆదేశించినట్లు వివరించారు. విచారణకు శివాజీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని, సంబంధిత డాక్యుమెంట్లు లేదా ఆధారాలు సమర్పించాలని కమిషన్ పేర్కొంది. దర్యాప్తునకు పూర్తి సహకారాన్ని అందించాలని కమిషన్ శివాజీకి సూచించింది.
మరోవంక- ఈ వివాదంపై శివాజీ స్పందిస్తూ.. క్షమాపణలు కోరాడు. ఈ ఈవెంట్ లో రెండు అన్ పార్లమెంటరీ పదాలను వాడానని, వీటివల్ల ఎవరికైనా వారి మనోభావాలు దెబ్బతింటాయని అంగీకరించాడు. తాను అమ్మాయిలందరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, హీరోయిన్ల గురించేనని వివరణ ఇచ్చాడు. హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు బట్టల వల్ల ఇబ్బందులు ఉండకూడదనేది తన ఉద్దేశమని, ఎవరినీ అవమానపర్చాలని కాదని అన్నాడు. స్త్రీని ఎప్పుడూ ఓ మహాశక్తి, అమ్మవారిగా భావిస్తానని, వాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దనే ఉద్దేశంలో రెండు మాటలు దొర్లాయని పేర్కొన్నాడు. తన ఉద్దేశం మంచిదే అయినా ఆ పదాలు దొర్లకొండా ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. మంచి చెప్పాలనే తపన తప్ప అవమానపర్చాలనేది తన ఉద్దేశం కాదని అన్నాడు. శివాజీ తన వ్యాఖ్యలపై తానే చింతిస్తూ.. క్షమాపణ చెప్పినా మహిళా కమిషన్ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos