తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. సుమారు రెండు వారాలుగా శ్రీతేజ్కు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నా.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.
ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే తదితర విషయాలను కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మంగళవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ... ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ఐసీయూలో వెంటిలేటర్పైనే ఉన్నాడని ఆ హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. శ్రీతేజ్ మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని.. అతడ్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు.
కాగా తాను రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని.. కేసు కారణంగా అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేదని.. అల్లు అర్జున్ తరపు తాను వచ్చినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఎటువంటి సహాయం అవసరమైనా తమకి సాధ్యమైనంతవరకూ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కేసు విచారణలో ఉన్నందున ఆ బాలుడ్ని, బాధిత కుటుంబాన్ని కలవకూడదన్న సలహా మేరకు అల్లు అర్జున్ రాలేదని అల్లు అరవింద్ వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos