దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవీ మేయప్పన్ కుమారుడైన శరవణన్, తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మించారు. ఏవీఎం బ్యానర్పై వివిధ భాషల్లో సుమారు 176 సినిమాలను ఆయన నిర్మించారు.
తెలుగులో "సంసారం ఒక చదరంగం", "లీడర్", "జెమినీ" వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో "శివాజీ", "మెరుపు కలలు" వంటి బ్లాక్బస్టర్లను ఆయన అందించారు. సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సీరియళ్లను కూడా నిర్మించారు. 2014లో వచ్చిన "ఇదువుమ్ కదాందు పొగుమ్" ఈ బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం. ఆ తర్వాత 2022లో అరుణ్ విజయ్ హీరోగా "తమిళ్రాకర్స్" అనే వెబ్సిరీస్ను నిర్మించారు. శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఏవీఎమ్. శరవణన్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పవన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏవీఎం సంస్థను శరవణన్ సమర్థవంతంగా ముందుకు నడిపారని పవన్ కొనియాడారు. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా, ఎల్లప్పుడూ కుటుంబ సమేతంగా చూసే విలువలతో కూడిన, వైవిధ్యమైన కథలను ఎంచుకున్నారని గుర్తు చేసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos