వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ఏపీ హైకోర్ట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు పర్యవేక్షణ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే.. బెయిల్ రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అలాగే ఈ కేసు విచారణలో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకవేళ పోలీసుల వల్ల కాకపోతే చెప్పాలని.. సీబీఐకి కేసు విచారణను అప్పగిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఏపీ పోలీసుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 18 లోపు కేసులో ట్రయల్ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మకయ్యారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జిషీట్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వేగంగా ట్రయల్ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్ట్కు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను సీనియర్ న్యాయాధికారికి అప్పగించాలి. అభియోగాల రూపకల్పనకు సంబంధించిన అంశాన్ని ఈ ఏడాది 2026 ఏప్రిల్ 18 లోపు నిర్ణయించాలి. అభియోగాల నమోదు తర్వాత, సాక్ష్యాల పరిశీలనను ముగించాలి. ఏదైనా తదుపరి దర్యాప్తు అవసరమైతే మార్చి 31లోపు పూర్తి చేయాలి. పూర్తి విచారణ నవంబర్ 2026 లోపు ముగియాలి. ఈ ఆదేశాల అమలుకు సీనియర్ న్యాయాధికారి పర్యవేక్షణలో విచారణ చేయాలి. ప్రస్తుత ప్రక్రియలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని ఇతర విషయాల నుండి విముక్తి కల్పించాలి. విచారణను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీం కోర్టు సూచించింది. మొత్తం మీద సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ వేగవంతం కానుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos