ఏపీ ప్రభుత్వం పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు సంస్థలు పెట్టబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోగా.. కొందరు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అయితే తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. జపాన్కు చెందిన ప్రముఖ ఏసీల తయారీ కంపెనీ డైకిన్ రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతోంది. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో డైకిన్ ఇండస్ట్రీస్ రూ.వెయ్యి కోట్లతో కంప్రెసర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. తైవాన్కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులో డైకిన్ మెజారిటీ భాగస్వామిగా ఉండనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డైకిన్ రెచి ప్రెసిషన్లు శ్రీసిటీలో ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ 75 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదని చెబుతున్నారు. ప్రస్తుతం డైకిన్ దేశవ్యాప్తంగా 2 మిలియన్ యూనిట్లను తయారు చేస్తుండగా.. ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు 2030 నాటికి 5 మిలియన్ యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్లో ఏసీ విక్రయాల్లో మెజారిటీ వాటా దక్కించుకోవాలన్నదే తమ ఆలోచన అని చెబుతోంది డైకిన్.
ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడానికి చేసుకున్న ఈ ఒప్పందం వల్ల దేశీయంగా మధ్యతరగతి జనాలకు అతి తక్కువ ధరకే ఏసీలను అందించడం సాధ్యం అవుతుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డైకిన్ మాత్రమే కాదు శ్రీసిటీలో పలు సంస్థలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎంతోమందికి ఉపాధి కూడా దక్కుతోంది. డైకిన్ యూనిట్ ఏర్పాటైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos