నేడు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీలో కొన్ని గంటలపాటు చర్చ జరగనుంది. గత ఐదేళ్లుగా అనిశ్చితి నీడలో, రాజకీయ కక్ష సాధింపుల మధ్యలో నలిగిపోయిన అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి లోకేశ్తో పాటు సుమారు ఇరవై మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ తీర్మానాన్ని కూటమి సర్కార్ కేంద్రానికి పంపనుంది. తీర్మానం సమన్వయ బాధ్యతలు మంత్రులు లోకేష్, పయ్యావుల, నాదెండ్లకు అప్పగించారు. ఈ తీర్మానంతో కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత తెస్తూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఏప్రిల్ 1న జరిగే కేంద్ర కేబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, 2న పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సమావేశానికి వైసీపీ హాజరుకావడం లేదు. అమరావతి కోసం అసెంబ్లీ అంటూ సిఎం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆ పార్టీ విమర్శించింది. రైతులు, ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడ అని ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. శాసనసభను మాత్రమే ప్రభుత్వం ఒకరోజు నిర్వహించనుంది. శాసనమండలిలో వైసీపీ కి ఉన్న బలం నేపథ్యంలో ఈ తీర్మానాన్ని అడ్డుకుంటుందనే భయంతో నిర్వహించడం లేదనే వాదన రాజకీయ వర్గాల్లో నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos