ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై చర్చించింది. అనంతరం మొత్తం 35 అంశాలకు ఆమోదముద్ర వేసింది. ఇందులో అమరావతిలోని వివిధ వర్గాలకు ప్రయోజనాలు, రాష్ట్రంలో భూకేటాయింపులు, మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీకి ప్రయోజనాలు కల్పించే అంశాలతో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. అలాగే కల్తీ నెయ్యిపై తాజాగా సుప్రీంకోర్టు సిట్ వేసిన ఛార్జిషీట్ పైనా చర్చించారు.
పిడుగురాళ్ల వైద్యకళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చించారు. పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనను ఆమోదించారు. అలాగే అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.ఆమెకు డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. మరోవైపు ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వడానికి మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్ గ్రేడ్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలో పలు సంస్థలకు భూకేటాయింపులకు కూడా ఆమోదం లభించింది.
అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదించారు. అలాగే నందకోటలో కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదించారు. వీటితో పాటు పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు కూడా ఆమోదం లభించింది. అలాగే ఇంధనశాఖలో పలు పరిపాలన అనుమతులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos