రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవన ప్రాంగణంలో మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఆర్డీఏ ఆఫీసు పనుల ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది.
ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించింది. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనాన్ని 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ 2.51 ఎకరాల విస్తీర్ణం, భవనం నిర్మాణం కోసం ఇప్పటివరకూ రూ.61.48 కోట్ల ఖర్చుపెట్టింది. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. బ్యాలెన్స్ పనుల పూర్తికి రూ.160 కోట్లు ఖర్చు కానుంది.
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇచ్చినపుడు ఒక్క నెల రోజుల్లో 34,305 ఎకరాలు ఇచ్చారని.. గత ప్రభుత్వం రైతు సోదరులను ఇబ్బంది పెట్టిందన్నారు. టెండర్లు అన్నీ సమయానికి పూర్తవుతాయి.. ప్రపంచ టాప్ 5 సిటీలలో ఒకటిగా అమరావతిని చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ. మరోవైపు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో అడవి జంతువులను, చిట్టడవిని పెంచారని విమర్శించారు. గత ప్రభుత్వం లో పోలీసు పరిపాలన సాగించారని... అసైన్డ్ కౌలు వేయడం లేదని చాలామంది రైతులు అడిగితే తాము రెండు విడతలుగా కౌలు వేశామని వెల్లడించారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos