జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటెయినర్ లో డ్రగ్స్ అంటూ రాజకీయంగా చోటు చేసుకున్న వివాదానికి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది. జగన్ హయాంలో రాష్ట్రానికి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయంటూ అప్పటి ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో.. విశాఖ తీరానికి చేరిన ఆ కంటెయినర్ లో ఉన్న సరుకు పై సీబీఐ విచారణ చేసింది. తాజాగా నార్కోటిక్ లాబ్ అందులోని సరుకును పరీక్షించి మత్తు పదార్థాలు లేవని తేల్చింది. ఆ షిప్ ను విడుదల చేయాలని సీబీఐ లేఖ రాయడంతో ఆ వివాదానికి ఇప్పుడు ముగింపు పడినట్లు అయింది.
ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్ లో 25,000 టన్నుల డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయేమోననే అనుమానంతో అప్పట్లో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు శాంపిల్స్ను ఢిల్లీలోని ల్యాబ్కు పంపించగా.. వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని సీబీఐ అధికారులు తేల్చారు. ఈ మేరకు అధికారులు కోర్టుకు నివేదికను అందించారు.. దీంతో కంటైనర్ సంధ్యా ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. గతనెల 27న పోర్టు అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.
ఏపీకి చెందిన సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి రవాణా చేసుకునేందుకు డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా.. ఈ ఏడాది మార్చి 16న విశాఖపట్నం పోర్టుకు ఎస్ఈకేయూ-4375380 కంటైనర్లో వెయ్యి బ్యాగుల్లో పంపించారు. ఈ సరుకు విషయంలో ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీకి చెందిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. గుజరాత్ ల్యాబ్ నుంచి మార్చి 19న వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి వీటిలో 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించగా... ఆ తర్వాత నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత నివేదిక వచ్చింది.
అయితే విచిత్రమేమిటంటే... అప్పట్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని గుర్తించగా.. ఇప్పుడు అవశేషాలు లేవని నివేదిక వచ్చింది. ఈ కంటైనర్ అంశంలో వైసీపీ, టీడీపీల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టిన సంస్థపై ఆరోపణలు రాగా.. నేతలకు వారితో లింక్ ఉందని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ కంటైనర్లో వచ్చిన డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ అవశేషాలు లేవని తేలడంతో.. పార్టీలు ఎలా స్పందిస్తాయో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos