ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది. సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి 7.20 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు రాత్రి 9.35 గంటలకు చేరుకుంటారు. సోమవార రాత్రి ఢిల్లీలోని 1-జన్పథ్ నివాసంలో బస చేస్తారు. మంగళవారం రోజున పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారని సమాచారం. అనంతరం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి అమరావతికి తిరిగిరానున్నారు
ఈ పర్యటన సందర్బంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సాయం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తావనలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వివాదంలో సిట్ ఇచ్చిన నివేదిక పైన ఢిల్లీ పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఏపీకి మరో బెర్తు దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన లో ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అదే విధంగా జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో చోటు చేసుకునే పరిణామాలు, నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos