ఏపీ రాజధాని అమరావతికి పర్యాటక రంగంలో సరికొత్త శోభను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కృష్ణా నదీ తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో 'మెరీనా వాటర్ ఫ్రంట్'గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. అమరావతిని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలపాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెరీనా వాటర్ ఫ్రంట్లో భాగంగా జెట్టీలు, పర్యాటకుల కోసం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ఆహ్లాదాన్ని పంచే ల్యాండ్స్కేప్ పనులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పన కోసం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని, రివర్ ఫ్రంట్తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కు కూడా ఇందులో చోటు కల్పించాలని స్పష్టం చేశారు. 'బ్లూ-గ్రీన్ సిటీ'గా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన నిర్మించనున్న నూతన బ్యారేజీతో రాజధానికి నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వివరించారు. దీనివల్ల కృష్ణా నదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. నదిలో ఉన్న ఐల్యాండ్స్ను కూడా పర్యాటకపరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos