ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. బుధవారం హఠాత్తుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడం, అది కూడా కేవలం అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ కోసం సమయం కేటాయించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను నేరుగా పవర్ సెంటర్ వద్దే తేల్చుకోవాలనేది బాబు మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలను వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధాన అజెండా కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్రానికి రావలసిన నిధులు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేయాలని, విభజన హామీల మేరకు రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరనున్నారు.
మరోవైపు తమిళనాడులో సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, అమిత్ షా అక్కడ పావులు కదుపుతుండటం వంటి పరిణామాలు దక్షిణాది రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఈ కారణంగా పొరుగు రాష్ట్రాల రాజకీయాలు, ఎన్డీఏ (NDA) కూటమిలో ఏపీ ప్రాముఖ్యతపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. హడావుడిగా వెళ్లడం వెనుక కేవలం నిధులు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేంద్రానికి ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వడం కూడా బాబు వ్యూహంలో భాగమేనని అంచనా వేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం... బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం చంద్రబాబు రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం రాత్రి 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుగుపయనమై, అర్ధరాత్రి 1:30 గంటలకు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనకు రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos