ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీన జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు పలు మార్పులతో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు అందాయి. ఈ నేపథ్యంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం, ప్రజాభీష్టానికి అనుగుణంగా కొన్ని ముఖ్యమైన మార్పులకు ఆమోదం తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన డిమాండ్ను గౌరవిస్తూ, గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వానికి ప్రజాభిప్రాయంపై ఉన్న గౌరవాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా.. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ స్థానంలో అడ్డరోడ్డు జంక్షన్ను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురం మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చనున్నారు. మార్కాపురం జిల్లా పరిధిలోకి దొనకొండ, కురిచేడు మండలాలను తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లా విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే యధావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు.
విస్తీర్ణంలో చాలా పెద్దదిగా ఉన్న ఆదోని పట్టణాన్ని రెండు మండలాలుగా విభజించాలనే ప్రతిపాదనపై కూడా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపడంపై చర్చ జరిగినప్పటికీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos