ఏపీలో కూటమి ప్రభుత్వం 16 నెలల పాలన పూర్తి చేసుకుంది. సీఎం చంద్రబాబు పాలనా పరంగా గేరు మార్చారు. పాలనా పరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ ముద్ర ఆశించిన స్థాయిలో కనిపించటం లేదు. దీంతో, సీఎం చంద్రబాబు రూటు మార్చాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నేటి నుంచి జరిగే కలెక్టర్ల సదస్సు లో కీలక దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమయ్యారు. అమరావతిలో ఈ రోజు, రేపు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సు ద్వారా కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. పాలనలో తీసుకొస్తున్న సంస్కరణల మార్పు క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపించేలా కలెక్టర్లు వ్యవహరించాలని స్పష్టం చేయనున్నారు. ఆర్దికంగా కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. ఎక్కడా ఫిర్యాదులకు అవకాశం లేని విధంగా ఉండాలని తేల్చి చెప్పనున్నారు. గత సమావేశంలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్లు, వాటి ఫలితాలపై చర్చతో పాటు రానున్న రోజుల్లో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాజా సమావేశంలో చర్చించనున్నారు. కాగా అందులో అత్యంత కీలకమైన నిర్ణయాలే అమలు కాలేదని సీఎం చంద్రబాబు గుర్తించారు. ఈ సారి వాటికి స్పష్టమైన కాల పరిమితి విధించి అమలు దిశగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కాలేదు. భూ అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం తొలి సమావేశంలోనే ఆదేశించారు. దీంతో, రెవిన్యూ పరమైన అంశాలపైన మరోసారి స్పష్టత ఇవ్వనున్నారు. ఇక.. ఈ సదస్సు ద్వారా సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్దేశించనున్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి, వారితో కలిసి పనిచేయాలని సూచించటంతో పాటుగా... ఆఫీసులకు తక్కువగా పరిమితం కావాల్సిన అవసరాన్ని వివరించే అవకాశం ఉంది. ఇవాళ తొలిరోజు సమావేశంలో సీఎం ప్రసంగం తర్వాత ఆర్థిక అంశాలపై చర్చ జరగనుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ రాష్ట్ర, జాతీయ స్థూల ఉత్పత్తి, ప్రైమరీ, సెకండరీ సెక్టార్, సర్వీసెస్ వంటి కీలక రంగాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos