ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయి..అన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో మాత్రం ఆనందం లేదు. నేతలు ఎక్కువ. ఖాళీ అయ్యే పోస్టులు తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అగ్రనేతలు మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. ఐదు స్థానాల్లో కొన్నింటిని.. కూటమిలోని మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాల్సి రావడం కూడా పార్టీపరంగా ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు.
ఐదు స్థానాలున్నా.. అందులో మూడు ఆల్రెడీ రిజర్వ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతుంది. ఒకటి జనసేన నేత నాగబాబుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో ఆయనను ఎమ్మెల్సీగా చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మరొక స్థానం నుంచి వంగవీటి రాధాను ఎంపిక చేయాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు వంగవీటి రాధాకు హామీ ఇచ్చారు. దీంతో వంగవీటి రాధాకు కూడా ఒక సీటు కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు. వర్మకు సామాజికవర్గం కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అన్నది ఇప్పుడు అనుమానంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇక మిగిలేది ఒక్కటే. వంగవీటి రాధాకు కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే కృష్ణా జిల్లాలో మరొకరికి సీటు కేటాయించే అవకాశం ఉండదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం కోసం బుద్ధా వెంకన్న తో పాటు మరికొందరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇవ్వాలనుకున్నా సాధ్యపడే పరిస్థితులు లేవంటున్నారు. ఈ ఐదింటిలో ఒకే ఒకస్థానంలో కృష్ణా జిల్లా నేతను ఎంపిక చేస్తారు కాబట్టి రాధాకు తొలి ప్రయారిటీ ఉంటుంది. అయితే సొంత సామాజికవర్గం కోటాలో ఇవ్వాలనుకుంటే దేవినేని ఉమకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాధాకు హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. మాజీ మంత్రి జవహర్ పేరు బలంగా వినపడుతున్నది. మరి ఏ జిల్లా నుంచి నేతను ఎంపిక చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగానే మారింది.
మొత్తం మీద ఆశావహులు బోల్డంత మంది ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలన్నది మాత్రం పార్టీ హైకమాండ్ కు కత్తిమీద సాము అయిందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos