ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీచర్ల బదిలీ అంశంపై గందరగోళానికి చెక్ పెట్టే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. బదిలీలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఏటా కచ్చితంగా వేసవిలో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందించే పనిలో ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయులు చర్చలు జరిపారు. బదిలీలకు సంబందించిన నిబంధనలపై కొంతమేర స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలకు సంబంధించి మరో వారంలో ముసాయిదా బిల్లును తయారుచేసి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తోంది.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో టీచర్ల బదిలీలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోనున్నారు. అలాగే ఏటా కటాఫ్ తేదీని మే 31గా పరిగణించి సర్వీసును లెక్కించే విధంగా బిల్లును రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు బదిలీలకు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నారు.. ప్రభుత్వం సాధారణ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే టీచర్లు జీరో సర్వీస్ బదిలీలు ఉండాలని కూడా కోరుతున్నారు. ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త బిల్లును బట్టి.. సార్వత్రిక ఎన్నికలు, జనాభా లెక్కలు ఉంటే తప్ప.. ప్రతి ఏటా కచ్చితంగా బదిలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత విధానంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేస్తుండగా.. కొంతమంది టీచర్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా షెడ్యూల్ పదే పదే మారిపోతోంది.. అదే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే కోర్టు వివాదాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త చట్టంపై ఉపాధ్యాయులు ఏమంటారు.. ఏవైనా మార్పులు చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ బిల్లును రూపొందించి బడ్జెట్ సమావేశాల సమయానికి అసెంబ్లీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ బిల్లు అంశంపై మరోసారి ఈ నెల 17న టీచర్లతో సమావేశం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బిల్లు పై తుదకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos