బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి .. గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.మరో రెండు రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. గుంటూరు, విజయవాడల్లో మూడు రోజుల కిందటే కుండపోత వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. నిన్న బుధవారం రాత్రి గుంటూరు, విజయవాడల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది.. చెరువులను తలపించింది. పలు ప్రాంతాల్లో సుమారు రెండడుగుల మేర వరదనీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలన్నీ నీట మునిగాయి. నేడు, రేపు కూడా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ రీజియన్ లోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos