ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చాలాకాలం తర్వాత వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అందరూ ముందుగానే ఊహించినట్లుగానే సభలో ఆయన హాజరైన తొలి రోజునే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టగానే .. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ సభలో పట్టుపట్టారు.
గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని... గత ఐదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని... ప్రజాభీష్టం మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి కాసేపు నిరసన తెలిపిన అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్, బొత్స తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవటం.. వాకౌట్ నిర్ణయం ముందు బొత్సకు సూచనలు చేయడం వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఇవాళ జరగనున్న బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపైన చర్చించాలనే విషయం పైన నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు మూడు వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos