ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా.. జాతీయ పార్టీల అండ ఉండాలనుకుంటున్నారా.. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నారా.. జాతీయస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. జగన్ ఢిల్లీ ధర్నా వెనుక అసలు స్క్రిప్ట్, స్కెచ్ ధర్నా పూర్తయ్యే సరికి కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇండియా కూటమిలో చేరేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకునేందుకు జగన్ ధర్నా డ్రామా ఆడారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాకు ఆయన రాజకీయ స్నేహితుడైన కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ సైతం పెద్దగా మొగ్గు చూపులేదు. కానీ అనూహ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సమాజ్ వాది పార్టీ ధర్నాకు సంఘీభావం తెలపడం ఆశ్చర్యకరమని... తద్వారా కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇప్పటి పరిణామాల దృష్ట్యా సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా ఇండియా కూటమిలోకి ఎంట్రీకి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తేటతెల్లమయ్యిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల దృష్ట్యా అఖిలేష్ సాయాన్ని జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకు జరిగిన పరిస్థితులను పరిశీలిస్తే... జగన్ బీజేపీకి స్పీకర్ ఎన్నికలోనూ మద్దతు పలికారు. గతంలో ఇండియా కూటమి పార్టీలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా జగన్ నోరు విప్పలేదు. బీజేపీకే వంత పాడారు. సమాజ్ వాది, తృణమూల్, శివసేన వంటి పార్టీలపై గతంలో విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు కూడా. కాంగ్రెస్ ను కూడా వదలకుండా తీవ్రంగా విమర్శించారు. అయితే ఇండియా కూటమి నేతలు అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు జగన్ ధర్నాకు వరుసగా వచ్చి సంఘీభావం తెలిపారు. జగన్ తాను ఇండియా కూటమి వైపు మారబోతున్నానని సంకేతాలు పంపినందువల్లనే ... ఆ కూటమి నేతలు వరుసగా వచ్చి మద్దతు జగన్ కు మద్దతు పలికినట్లు ... ఇదంతా పక్కాగ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది.
ఏపీలో మిగతా రాజకీయ పక్షాలు జగన్ తో కలిసేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే సమన్వయంతో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ఏపీలో మిగతా రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్లాలంటే.. ఇండియా కూటమిలో చేరడం శ్రేయస్కరమని జగన్ స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కదలికలను బట్టి అర్థం అవుతోంది. కాగా జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపడం అనే పరిణామం కచ్చితంగా కేంద్ర బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించే విషయమే. అయితే ముందస్తు వ్యూహంతోనే జగన్ భవిష్యత్తు గురించి యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ ... వైసీపీ కి సహకరించే అవకాశం లేదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీ అవసరం ఉన్నా.. కొద్ది రోజుల్లో రాజ్యసభలో ఎన్డీఏ ప్రాతినిధ్యం పెరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటనుంది. మరోవైపు లోక్ సభలో టీడీపీ కింగ్ మేకర్ గా ఉంది. ఎన్డీఏకు బలమైన పక్షంగా నిలిచింది. ఏపీలో టీడీపీకి బద్ద విరోధిగా ఉన్న జగన్ కు సహకరించే స్థితిలో బీజేపీ లేదు. అందుకే ఈ పరిణామాలన్నింటినీ ఆలోచించిన జగన్ సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ ద్వారా ఇండియా కూటమిలో అడుగుపెట్టి.. . ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల స్నేహ హస్తాన్ని అందుకోవడంలో భాగంగానే ఈ ప్రయత్నాలు స్టార్ట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
మొత్తంగా జగన్.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి మళ్లీ అధికారం రాదని ఫిక్సయిపోయి.. కేంద్రం లోని ఆ పార్టీ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు ఎదుర్కొని సానుభూతి పెంచుకోవచ్చని.. ఇందులో భాగంగానే ఇండి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి. ఇక బీజేపీ ఏం చేయబోతుందన్నది ఇప్పుడు కీలకం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos