అమరావతి : రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ పూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట, ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.
వీటిని తొలగించటానికి సీఆర్డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఎన్సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. సెక్రటేరియట్ వెనుక వైపున ఎన్ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులపై మంత్రి నారాయణ మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జంగిల్ క్లియరెన్స్ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, రాజధాని క్యాపిటల్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos