ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పైన వేగంగా అడుగులు పడుతున్న క్రమంలో... న్యాయ పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన గత వైసీపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసు విచారణ వేళ అఫిడవిట్ ఫైల్ చేసి అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేసింది.
రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ ఈ రోజు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరుతో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో ఏపీ ఏకైక రాజధాని అమరావతి అని వెల్లడిస్తూ... భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని, మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న విధంగా నవ నగరాలతో రాజధానిని తీర్చి దిద్దుతామని వివరించారు. హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్, రాష్ట్ర సచివాలయం కోసం శాశ్వత భవనాలు సిద్ధమైన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాలను ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని అఫిడవిట్ లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం 2018-19లోనే భవన నిర్మాణాలు ప్రారంభమైన అంశాన్ని సీఎస్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడు సంవత్సరాలలో నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అఫిడవిట్ లో స్పష్టం చేసింది. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని.. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం న్యాయస్థానం ముందు ఉన్న ఎస్ఎల్పీ పైన విచారణ ముగించాలని ప్రభుత్వం అఫిడవిట్ లో కోరింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos