ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. అక్కడి విజయంతో స్ఫూర్తి పొందిన ప్రభుత్వం, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలతో పాటు గురుకులాలు, వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లోనూ 'ముస్తాబు'ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కేవలం పరిశుభ్రతే కాకుండా, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ వంటి సుగుణాలను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కార్యక్రమ అమలుకు సంబంధించిన విధివిధానాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై రాష్ట్రంలోని విద్యార్థులంతా ప్రతిరోజూ 'ముస్తాబు' కావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం కింద అన్ని పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకొని, సక్రమంగా తల దువ్వుకుంటునే పాఠశాల లోపలికి అనుమతించేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos