దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన అత్యంత విజయవంతంగా సాగింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంత్రి లోకేష్ చొరవతో ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఆర్ఎంజడ్ (RMZ) ఆంధ్రప్రదేశ్లో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దావోస్లో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండాతో లోకేష్ జరిపిన చర్చల అనంతరం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ పార్క్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ జీసీసీ (GCC) పార్క్ ను అభివృద్ధి చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉపాధి లభించనుంది. విశాఖను డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చడమే కాకుండా, రాయలసీమ ప్రాంతంలో కూడా పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్కులను ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖపట్నం ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఆర్ఎంజడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇది ఏఐ వర్క్ లోడ్ కు వెన్నెముకగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రాయలసీమలోని టేకులోడు వద్ద 1,000 ఎకరాలలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలే ఇంతటి భారీ పెట్టుబడికి పునాది వేశాయని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ హబ్గా మార్చేందుకు త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు లోకేష్ వివరించారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, క్వాంటం వ్యాలీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు ద్వారా రూ. 8.75 లక్షల కోట్ల విలువైన 211 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, దీనివల్ల 8.36 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన సభలో వెల్లడించారు. ప్రపంచ సవాళ్లకు ఏపీలోని స్థానిక ప్రతిభే పరిష్కారం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos